Sathkarya SevaSamithi

Sathkarya SevaSamithi

Share

03/12/2020

_*కార్తీక పురాణం - 18 వ అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*సత్కర్మానుష్టాన ఫల ప్రభావము*

☘☘☘☘☘☘☘☘☘

*"ఓ మునిచంద్రా ! మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి - గురువు - అన్న - దైవము సమస్తము మీరే , నా పూర్వ పుణ్య ఫలితమువలనే కదా మీబోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహా పాపినయి మహారణ్యములో ఒక మొద్దు బారిన చెట్టునైయుండగా , తమ కృపవలననే నాకు మోక్షము కలిగినది కదా ! మీ దర్శన భాగ్యము లేని యెడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున వుండవలసినదే కదా ! అట్టి ! నేనెక్కడ ! మీ దర్శన భాగ్యమెక్కడ ! నాకు సద్గతి యెక్కడ ? పూణ్యఫలప్రదాయి అగు ఈ కార్తీకమాసమెక్కడ ! పాపాత్ముడనగు నేనెక్కడ ? ఈ విష్ణ్యాలయమందు ప్రవేశించుటెక్కడ ? ఇవి అన్నియును దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన , నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలయునో , దాని ఫలమెట్టిదో విశదీకరింపు"* డని ప్రార్ధించెను.

*"ఓ ధనలోభా ! నీ వడిగిన ప్రశ్నలన్నియు మంచివే. అవి అందరికి ఉపయోగార్ధమైనట్టివి కాన , వివరించెదను. శ్రద్దగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని , సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మ నాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మొనరించిన జ్ఞానము కలుగును. మానవుడే , జాతివాడో , ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక , సత్కర్మల నచారించినను వ్యర్ధమగును. అటులనే కార్తీకమాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖమాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను , మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగాను అనగా ఈ మూడు మాసముల యందయిననూ తప్పక నదిలో ప్రాతఃకాల స్నానము చేయవలెను. అటుల స్నానము ఆచరించి దేవర్చన చేసిన యెడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందు , స్నానము చేయవచ్చును. ప్రాతఃకాలమున స్నానము చేసిన మనుజుడు సంద్యావందనం సూర్యనమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించరించిన వారికీ చతుర్విధ పురుషార్ధములు సిద్దించును. కార్తీక మాసముతో సమానమైన మాసము , వేదములతో సరితూగు శాస్త్రము , గంగ గోదావరి నదులకు సమాన తీర్ధములు , బ్రాహ్మణులకు సమానమైన జాతీయు , భార్యతో సరితూగు సుఖమునూ , ధర్మముతో సమానమైన మిత్రుడనూ , శ్రీ హరితో సమానమైన దేవుడునూ లేడని తెలుసుకోనుడు. కార్తీక మాసమందు విధ్యుక్తధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు"*. అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడిటుల ప్రశ్నించెను.

*"ఓ మునిశ్రేష్టా ! చతుర్మాస్యవ్రతమని చెప్పితిరే ! ఏ కారణం చేత దానిని నాచరించవలెను ? ఇదివరకెవ్వరయిన ఈ వ్రతమును ఆచరించియున్నారా ? ఆ వ్రతము యొక్క ఫలితమేమి ? విధానమెట్టిది ? సవివరంగా విశదికరింపు"* డని కోరెను. అందులకు ఆంగీరసుడిటుల చెప్పెను.

*"ఓయీ ! వినుము. చతుర్మాస్యవ్రతమనగా శ్రీమహావిష్ణువు మహాలక్షితో ఆషాడ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీకశుద్ధ ఏకాదశినాడు నిద్రనుండి లేచును. ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాడ శుద్ధ ఏకాదశి 'శయన ఏకాదశి'* అనియు , *కార్తీక శుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' అనియు , ఈ వ్రతమునకు , చతుర్మాస్య వ్రతమనియు పేర్లు. ఈ నాలుగు మాసములలో శ్రీ హరి ప్రీతి కొరకు స్నాన , దాన , జప , తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలము కలుగును. ఈ సంగతి శ్రీమహావిష్ణువు వలన తెలిసికొంటిని కాన , ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను".*

తొలి కృతయుగంబున వైకుంఠ మందు గరుడ గంధర్వాది దేవతలచేత , వేదములచేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి యుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును , చతుర్బాహుండును , కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడియుండెను. అంత శ్రీ హరి నారదుని గాంచి ఏమియు తెలియనివానివలె మందహాసముతో నిట్లనెను. *"నారదా ! నీవు క్షేమమే గదా ! త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్టానములు యెట్టి విఘ్నములు లేక సాగుచున్నావా ? మానవులందరికి విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా ? ప్రపంచమున ఏ అరిష్టములు లేక యున్నవి కదా?"* అని కుశలప్రశ్నలడిగెను. అంత నారదుడు శ్రీహరికీ ఆదిలక్ష్మికీ నమస్కరించి *"ఓ దేవా ! ఈ జగంబున నీ వెరుగని విషయమున లేవియునూ లేవు అయినను నన్ను వచింపుమనుటచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు - మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తులగుదురో యెరుగ లేకున్నాను. కొందరు భుజించ కూడదనిన పదార్దములు భుజించుచున్నారు. కొందరు పుణ్య వ్రతములు చేయుచు , అవి పూర్తిగాక మునుపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా , మరి కొందరు అహంకార సహితులుగా , పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ముల నొనర్చి రక్షింపు"* మని ప్రార్ధించెను. జగన్నాటక సూత్రధారుడయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడగంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి , ముసలి బ్రాహ్మణరూపంతో ఒంటరిగా తిరుగుచుండెను.

ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు , పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలి వాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు *"ఈ ముసలి వానితో మనకేమి పని"* అని ఊరకుండిరి. కొందరు గర్విష్టులైరి మరి కొందరు కామార్తులై శ్రీహరిని కన్నేతియైనను చూడకుండిరి. వీరందిరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి *"వీరినెట్లు తరింపజేతునా ?"* అని అలోచించుచు , ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ , చక్ర , గదా , పద్మ , కౌస్తుభ , వనమాలాద్యలంకారయుతుడై నిజరూపమును ధరించి , లక్ష్మి దేవితోడను , భక్తులతోడను ముని జన ప్రీతికరమగు నైమిశారణ్యమునకు వెడలెను.

ఆ వనమందు తపస్సు చేసుకోనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదెంచిన సచ్చిదానంద స్వరుపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్దలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు నా లక్ష్మినారాయణులనిట్లు స్తోత్రము గావించిరి.

*శ్లో|| శాంతకారం! భజగాశయనం! పద్మనాభం! సురేశం!*
*విశ్వాకారం! గగనసదృశం! మేఘవర్ణం శుభాంగం! |*
*లక్ష్మికాంతం! కమలనయనం! యోగిహృద్ద్యానగమ్యం!*
*వందేవిష్ణుం! భవభయహారం! సర్వలోకైకనాథం ||*

*శ్లో|| లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీ రంగదామేశ్వరీం*
*దాసి భూత సమస్త దేవా వనితాం* *లోకైకదీపంకురాం |*
*శ్రీ మన్మంద కటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర* *గంగాధరాం*
*త్వాం త్రైలోక్య కుటుంబినీ౦ సరసిజాం వందే ముకుంద ప్రియం||*

*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి అష్టాదశాధ్యాయము - పద్దెనిమిదో రోజు పారాయణము సమాప్తం.*

30/11/2020

_*కార్తీక పురాణం - 15 వ అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందుట*

☘☘☘☘☘☘☘☘☘

అంతట జనకమహారాజుతో వశిష్ఠమహాముని - జనకా ! కార్తీకమహాత్మ్యము గురించి యెంత వివరించిననూ పూర్తికానేరదు. కాని , మరియొక యితిహాసము తెలియ చెప్పెదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పెను.

ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట , చేయుట , శివకేశవులవద్ద దీపారాధనను చేయుట , పురాణమును చదువుట , లేక , వినుట , సాయంత్రము దేవతాదర్శనము చేయలేనివారు కాలసూత్రమనెడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీకశుద్ద ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు యిచ్చిన యెడల , విశేషఫలము పొందగలరు. ఈ విధముగా నెలరోజులు విడువక చేసిన యెడల అట్టివారు దేవదుందుభులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెలరోజులు చేయలేనివారు కార్తీకశుద్ద త్రయోదశి , చతుర్దశి , పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపమునుంచవలెను.

ఈ మహా కార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన యెడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు వుంచిన దీపము యెగద్రోసి వృద్ధి చేసినయెడలను , లేక , ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు , వినుమని వశిష్ఠులవారు యిట్లు చెప్పుచున్నారు.

సరస్వతీ నదీతీరమున శిధిలమైన దేవాలయమొకటి కలదు. కర్మ నిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీకమాసమంతయు అచటనే గడిపి పురాణపఠనముజేయు తలంపురాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రముగా వూడ్చి , నీళ్లతో కడిగి , బొట్లుపెట్టి , ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి , దూదితో వత్తులుజేసి , పండ్రెండు దీపములుంచి , స్వామిని పూజించుచు , నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీకమాసము ప్రారంభమునుండి చేయుచుండెను. ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి , నలుమూలలు వెదకి , తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయియున్న వత్తిని తినవలసినదేనని అనుకొని నొట కరచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను. నోటకరచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తికూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీకమాస మగుటవలనను , శివాలయములో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను.

ధ్యాన నిష్ఠలో వున్న యోగిపుంగవుడు తన కన్నులను తెరచిచూడగా , ప్రక్కనొక మానవుడు నిలబడి యుండుటను గమనించి *"ఓయీ ! నీవెవ్వడవు ? ఎందుకిట్లు నిలబడియుంటివి ?"* అని ప్రశ్నించగా , *"ఆర్యా ! నేను మూషికమును , రాత్రి నేను ఆహారమును వెతుకుకొంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యివాసనలతో నున్న ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నొటకరచి ప్రక్కనున్న దీపంచెంత నిలబడి వుండగ , నా అదృష్టము కొలదీ ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తితిని. కాని , ఓ మహానుభావా ! నేను ఎందుకీ మూషికజన్మ మెత్తవలసివచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరింపు"* మని కోరెను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వము తెలుసుకొని , *"ఓయీ ! క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లికుడని పిలిచెడివారు. నీవు జైనమత వంశానికి చెందిన వాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ , ధనాశపరుడై దేవపూజలు , నిత్యకర్మలు మరచి , నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు , మంచివారలను , యోగ్యులను నిందించుచు పరులచెంత స్వార్థచింత గలవాడై ఆడపిల్లలను అమ్మువృత్తిచేస్తూ, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు , సమస్త తినుబండారములను కడుచౌకగా కొని , తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి , అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దానివలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన , నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్తిన ధనమును త్రవ్వి , ఆ ధనముతో దానధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షముపొందు"* మని అతనికి నీతులు చెప్పి పంపించెను.

*ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమహాత్మ్యమందలి పంచదశాధ్యాయము - పదిహేనోరోజు పారాయణము సమాప్తము.*

Want your place of worship to be the top-listed Place Of Worship in Kakinada?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


Jawahar Street
Kakinada
533001