YSRCP Intellectuals Forum
10/05/2026
Congratulations 🎉🎉 to Mr. Joseph Vijay for swearing as C.M of Tamilnadu. I wish you all the best Vijay garu
01/05/2026
గొంగిరెడ్డి రాఘవరెడ్డి,ఐపీఎస్ (1928-2022)
(హరిజన వసతి గృహం విద్యార్థి - సామాజిక విప్లవకారుడు)
••••••••••••••••••••••••••••••••
వ్యాసకర్త : డా. తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి
అభ్యుదయమే గమనం ...
సంస్కరణ ఆశయం ...
ఆదర్శం జీవితం...
గొంగిరెడ్డి రాఘవరెడ్డి IPS
▪️వివరాలు
ఉమ్మడి వరంగల్ జిల్లా పెంబర్తి గ్రామానికి చెందిన భూస్వామ్య కుటుంబంలో గొంగిరెడ్డి అనంతరెడ్డి - రామచూడమ్మ దంపతులకు జూలై 5 తేదీన , 1928 లో రాఘవరెడ్డి జన్మించారు. తర్వాత మరో ఇద్దరు కుమారులకు కూడా జన్మనిచ్చారు. చుట్టు పక్కల నాలుగు గ్రామాలలో వీరి కుటుంబానికి భూములు ఆస్తులు ఉండేవి. ఈ గ్రామాల్లో కొలనుపాక గ్రామం ఒకటి! కానీ దురదృష్టవశాత్తు 1933లో అనంతరెడ్డి - రామచూడమ్మ దంపతులు కలరా వ్యాధితో కాలం చేశారు. అప్పుడు రాఘవరెడ్డి వయసు ఆరు సంవత్సరాలు.మిగతా ఇద్దరు మరీ చిన్నపిల్లలు. ఈ దయనీయ పరిస్థితిలో ఆస్తులు అంతస్తులు ఉన్నప్పటికీ రాఘవరెడ్డి సోదరులు అనాథలుగా మారిపోయారు .
గొంగిరెడ్డి అనంతరెడ్డి సోదరీమణులు అనాథలుగా మారిన పిల్లలకు, ఆస్తులకు పెద్దదిక్కయ్యారు. వీరు పిల్లలను చేరదీశారు.నాలుగు గ్రామాల్లోని వ్యవసాయ భూములను కాపాడారు.
▪️రావి నారాయణరెడ్డి చేయూత
అప్పట్లో మహాత్మాగాంధీ సిద్ధాంతాలకు ప్రభావితమై కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, హరిజన సేవా సంఘం కార్యదర్శిగా ఉన్న రావి నారాయణరెడ్డి, రాఘవరెడ్డిని మానవీయ హృదయంతో చేరదీశారు. హైదరాబాద్లోని వివేకవర్థిని ఉన్నత పాఠశాలలో చేర్పించారు. రాఘవరెడ్డి తమ్ముళ్ళు మరీ చిన్న పిల్లలు కావడంతో మేనత్తల సంరక్షణలో ఉండిపోయారు.
1934 మార్చి 9 వ తేదీన మహాత్మాగాంధీ హైదరాబాద్లోని వివేకవర్ధిని ఉన్నత పాఠశాలను సందర్శించారు. అక్కడ గాంధీజీ రాఘవరెడ్డి పరిస్థితి తెలుసుకుని ఆశీర్వదించారు.
తర్వాత హరిజన వసతి గృహాన్ని సందర్శించమని గాంధీజీని రావి నారాయణరెడ్డి కోరారు. అస్పృశ్యత,అంటరానితనం, వంటి సామాజిక రుగ్మతలపై పోరాటం సాగిస్తున్న గాంధీజీ... వెంటనే వసతి గృహాన్ని సందర్శించి,అక్కడి పరిస్థితులు సమీక్షించి, అక్కడ హరిజన బాలురతో పాటుగా అగ్రవర్ణ బాలురు కూడా ఉండాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేసారు. రాఘవరెడ్డిని హరిజన వసతి గృహంలో చేర్పించాల్సిందిగా రావి నారాయణరెడ్డిని కోరారు. ఆ విధంగా గాంధీ సూచన మేరకు,రాఘవరెడ్డి హరిజన వసతి గృహంలో అగ్రవర్ణ బాలుడిగా ప్రవేశించాడు.
▪️దళితుల వసతిగృహంలో విద్యాభ్యాసం
నలభై మంది దళిత విద్యార్థులతో కలిసి వసతి గృహంలో ఉంటూ ప్రాథమిక విద్యను పూర్తి చేసిన రాఘవరెడ్డి, అపారమైన సామాజిక స్పృహను పెంపొందించుకున్నాడు.దళిత విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులు, వారి ఆహారపు అలవాట్లు, వసతి గృహాల్లో ఉండే కనీస సౌకర్యాల లేమిని దగ్గర నుండి గమనించాడు. ఆకలికి కులం లేదని, కష్టపడే తత్వంలో అందరూ సమానమేనని లేత ప్రాయంలోనే అర్థం చేసుకున్నాడు. సమాజం సృష్టించిన కుల గోడలు ఎంత అశాస్త్రీయమైనవో ఆయనకు చిన్నతనంలోనే బోధపడింది. ఇది ఆయనను జీవితకాలం సమతావాదిగా మార్చింది.
▪️రాజ బహద్దూర్ వెంకట్రామిరెడ్డి ఆదరణ
ప్రాథమిక విద్య తర్వాత నిజాం పోలీస్ కమిషనర్ రాజ బహద్దూర్ వెంకట్రామిరెడ్డి ప్రోత్సాహంతో రాఘవరెడ్డి.. హైదరాబాద్లో రెడ్డి హాస్టల్లో ఉంటూ హైస్కూల్ విద్య అభ్యసించారు.1942లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసారు.
▪️స్వామిరామానంద తీర్థ సహచరునిగా -
క్విట్ ఇండియా ఉద్యమంలో..
హైస్కూల్ విద్య అభ్యసిస్తున్నప్పుడే ఒకవైపు స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా వివిధ విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. స్వామిరామానంద తీర్థ సహచరునిగా గాంధీ ప్రభావంతో "క్విట్ ఇండియా" ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు..
▪️హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో
ముఖ్యంగా తమ ఆస్తులను చూసుకోవడానికి, తన ఇద్దరు తమ్ముళ్లను పోషించుకోవడానికి ఆయన తన గ్రామంలోనే స్థిరపడవలసి వచ్చింది. కాబట్టి 1942 లో మెట్రిక్యులేషన్ పూర్తయిన తర్వాత సొంత గ్రామానికి వెళ్లిన రాఘవరెడ్డి, వ్యవసాయం వృత్తిగా జీవితం ప్రారంభించారు..1942 నుండి 1948 వరకు గ్రామంలోనే ఉన్నారు.
ఈ సమయంలో గ్రామాల్లో నెలకొన్న దారుణమైన పరిస్థితులు, ప్రజలు అనుభవిస్తున్న అణిచివేత, పల్లెల్లో రాజ్యమేలుతున్న వెట్టిచాకిరి, ఆయనను తీవ్రంగా కలచివేశాయి. మరోవైపు స్వాతంత్ర్య కాంక్షతో భారతదేశంలో సామాన్య ప్రజానీకం కొనసాగిస్తున్న పోరాట భాగస్వామ్యం , రాజకీయ అలజడి, స్వేచ్ఛ కోసం సాగుతున్న ఆరాటం ఆయనలో దేశభక్తిని సామాజిక బాధ్యతను మరింతగా రగిలించాయి. ఫలితంగా హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో శక్తివంచన లేకుండా పాల్గొన్నారు. రజాకర్ల అరాచకాలను ఎదిరించడంలో
దళాలతో కలిసి పని చేశారు.
▪️పోలీస్ చర్య తర్వాత..
తెలంగాణ విమోచనం తర్వాత ఉన్నత విద్యను అభ్యసించాలనే తపన కలిగింది.
తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు . రాజ బహద్దూర్ వెంకట్రామిరెడ్డి ప్రోత్సాహంతోనే తిరిగి ఉన్నత విద్యకు శ్రీకారం చుట్టారు. మరోవైపు కుటుంబ బాధ్యతను కొనసాగిస్తూ.... హైదరాబాద్లోని ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం సంపాదించుకొని, అప్పుడే ప్రారంభమైన సాయంకాల కళాశాలలో చేరాడు. అపారమైన ఉత్సాహంతో, ఏకాగ్రతతో ఉద్యోగం చేస్తూనే చదువుకుంటూ 1952 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆర్ట్స్లో డిస్టింక్షన్తో పట్టభద్రుడయ్యాడు.
▪️సాయంకాల కళాశాలలో
ఆర్ట్స్ లో డిగ్రీ సంపాదించిన తర్వాత కూడా, ఉద్యోగం చేస్తూనే సాయంకాల కళాశాలలో లా చదివి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.
▪️ఉద్యోగ జీవితం
1956లో హైదరాబాద్ పోలీస్ సర్వీస్కు ఎంపికయ్యారు, కాగా హైదరాబాద్ రాష్ట్రం మూడుగా విభజించడం అయ్యింది.
హైదరాబాద్ రాష్ట్ర విభజన (1956)
1)తెలంగాణ ప్రాంతం: అప్పటి ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది.
2)మరాఠ్వాడా ప్రాంతం :
అప్పటి బాంబే రాష్ట్రంలో /ప్రస్తుత మహారాష్ట్రలో కలిసింది.
3)కన్నడ ప్రాంతం : అప్పటి మైసూర్ రాష్ట్రంలో / ప్రస్తుతం కర్ణాటకలో కలిసింది.
ఈ కారణంగా 1957లో నేరుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా (DSP )చేరారు. తర్వాత ఐపీఎస్ (IPS) గా ఎంపికయ్యారు. 1986లో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DIG )కేడర్లో పదవీ విరమణ చేశారు. 30 సంవత్సరాల సుదీర్ఘ సేవలతో వృత్తి ధర్మానికి వన్నెతెచ్చారు.
▪️ఆత్మకథ - As I Look Back
రాఘవరెడ్డి గారు తన జీవితంలోని ఎత్తుపల్లాలను, సామాజిక పోరాటాలను, వృత్తిగత ప్రయాణాన్ని అక్షరబద్ధం చేస్తూ "నేను వెనక్కి తిరిగి చూస్తే" అర్థంలో ‘యాజ్ ఐ లుక్ బ్యాక్’ (As I Look Back) పేరుతో ఆత్మకథను రచించారు.పోలీస్ వ్యవస్థలోని సవాళ్లు, దర్యాప్తులో పాటించాల్సిన మెళకువలు నైతిక విలువల గురించి రాఘవరెడ్డి ఇందులో కూలంకషంగా చర్చించారు.
2006 డిసెంబర్ 03న హైదరాబాద్లో ఈ పుస్తకాన్ని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆవిష్కరించారు.
ఈ పుస్తకాన్ని కేవలం ఒక ఆత్మకథగానే కాకుండా, పోలీస్ శాఖలో పనిచేసే వారికి, పరిశోధకులకు ఒక "స్టడీ మెటీరియల్" గా పరిగణిస్తున్నారు.
▪️కీలకమైన కేసులు
రాఘవరెడ్డి గారు తన 30 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో అనేక సంచలన కేసులను డీల్ చేశారు.
రాఘవరెడ్డి గారి సుదీర్ఘ పోలీస్ ప్రస్థానంలో 1964లో చోటుచేసుకున్న ఒక అపహరణ కేసు ఆయన వృత్తిపరమైన నైపుణ్యానికి, సమయస్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తుంది. రాఘవరెడ్డి హైదరాబాద్ సైఫాబాద్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ (ACP)గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో.. గోషామహల్ మెయిన్ రోడ్డుపై, పట్టపగలు ఒక ముస్లిం యువ వివాహితను బలవంతంగా టాక్సీలో అపహరించుకుపోయారు.ఈ ఘటన, అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసి, శాంతిభద్రతలకు సవాలుగా మారింది.
పరిస్థితి తీవ్రతను గమనించిన రాఘవరెడ్డి గారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. విచారణలో భాగంగా ఒక చిన్నారి సాక్షి ఇచ్చిన సమాచారం (టాక్సీ నంబర్) ఈ కేసులో కీలక మలుపుగా మారింది. ఆ క్లూ ఆధారంగా, సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ కాలంలోనే తన మేధస్సుతో కేవలం మూడు గంటల వ్యవధిలో నిందితులు ఉన్న ప్రాంతాన్ని కనిపెట్టారు. ఉప్పల్ శివార్లలోని ఒక వ్యవసాయ బావి వద్ద ఉన్న గుడిసెలో బాధితురాలిని బంధించినట్లు గుర్తించి, మెరుపు దాడి చేశారు.
చీకటి పడిన ఆ సమయంలో జరిగిన ఈ ఆపరేషన్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. రౌడీ మూకలు రాళ్లతో దాడి చేస్తున్నా భయపడకుండా, రాఘవరెడ్డి తన సర్వీస్ రివాల్వర్తో గాల్లోకి కాల్పులు జరుపుతూ ముఠాను నిలువరించారు. ఈ క్రమంలో 'కవ్వా పహిల్వాన్' అనే పేరుమోసిన రౌడీ.. కత్తితో దాడి చేయబోగా, ఒక హెడ్ కానిస్టేబుల్ తన ప్రాణాలకు తెగించి అసిస్టెంట్ కమిషనర్ను పక్కకు నెట్టి కాపాడారు. ఈ పెనుగులాటలో ఆ కానిస్టేబుల్ 40 అడుగుల లోతు ఉన్న బావిలో పడి తీవ్రంగా గాయపడినప్పటికీ, నిందితులందరినీ పట్టుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకముందే బాధితురాలిని సురక్షితంగా కాపాడి, నగరంలో చెలరేగబోయే పెద్ద మతకల్లోలాన్ని రాఘవరెడ్డి గారు తన చాకచక్యంతో నివారించారు. ఈ సాహసోపేతమైన చర్య హైదరాబాద్ పోలీస్ చరిత్రలో ఒక చిరస్మరణీయ ఘట్టంగా మిగిలిపోయింది.
భారతదేశ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కమ్యూనిస్ట్ కుట్ర కేసుగా నిలిచిన "తరిమెల నాగిరెడ్డి కుట్ర కేసు" లో దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు.
1969లో నమోదైన ఈ కేసులో 67 మంది నిందితులు ఉన్నారు. ఎక్కడా థర్డ్ డిగ్రీ ఉపయోగించకుండా, కేవలం సానుభూతి మానవీయ కోణంలో విచారణ జరిపి నిందితుల మనసు గెలుచుకున్నారు.కోర్టులో 325 మంది సాక్షులను ప్రవేశపెట్టి, 777 పత్రాలను సమర్పించారు. చివరకు నాగిరెడ్డితో సహా 22 మందికి శిక్ష పడేలా చేశారు.
ఈ కేసు దర్యాప్తు తీరును సుప్రీంకోర్టు హైకోర్టు కూడా ప్రశంసించాయి.
వృత్తి ధర్మానికి నిజాయితీ తోడైతే అది శత్రువుల చేత కూడా ప్రశంసలు పొందేలా చేస్తుందనడానికి రాఘవరెడ్డి గారి వృత్తి జీవితం నిలువెత్తు నిదర్శనం! దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'తరిమెల నాగిరెడ్డి కుట్ర కేసు'లో రాఘవరెడ్డి గారి దర్యాప్తు తీరు పారదర్శకమైనది. నిందితుడిగా ఉన్న తరిమెల నాగిరెడ్డి గారు, సుప్రీం కోర్టులో స్వయంగా వాదనలు వినిపిస్తూ.. తనను విచారించిన అధికారి రాఘవరెడ్డి గారి నిష్పాక్షికతను, హేతుబద్ధతను ప్రత్యేకంగా అభినందించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఒక నిందితుడు తనను దర్యాప్తు చేసిన అధికారి నైతికతను కోర్టు సాక్షిగా కొనియాడటం అనేది ఆయన వృత్తి జీవితంలో ఒక అపురూపమైన గౌరవ చిహ్నం!
▪️కుటుంబం
1945 లో రాఘవరెడ్డి వివాహం కమలాదేవితో జరిగింది. వివాహం తర్వాత 1948 వరకు అదే గ్రామంలో ఉన్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు.రంజిత్ రెడ్డి, రాజీవ్ రెడ్డి, సృజనాదేవి,
రమాదేవి, పృథ్విరాజ్ రెడ్డి.వీరిలో పెద్ద కొడుకు రంజిత్ రెడ్డి, చిన్న కొడుకు పృథ్విరాజ్ రెడ్డి మరణించారు. రాజీవ్ రెడ్డి అమెరికాలో నివసిస్తున్నారు .ఇద్దరు కుమార్తెలు హైదరాబాద్లోనే ఉన్నారు.
▪️ఆదర్శ రైతుగా
పదవీ విరమణ తర్వాత రాఘవరెడ్డి రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్లో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో స్థిరపడ్డారు."ఆదర్శ రైతు"గా జీవితం ప్రారంభించారు.. బీడు భూములను సారవంతమైన పొలాలుగా మార్చడంలో ఆయన విశేషంగా కృషి చేసారు.
ఔషధ ,సుగంధ మొక్కల రంగంలో, ప్రగతిశీల ఫలితాలు సాధించారు. రాఘవరెడ్డి సాగుచేసిన మొక్కల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి
•ఔషద మొక్కలు : అశ్వగంధ, కలబంద, సోనాముఖి, మధుర పత్రి, వాసా, కస్తూరిబెండ, సుఫెద్ ముస్లి.
•సుగంధ మొక్కలు: నిమ్మగడ్డి,పాల్మరోసా,జెరేనియం,ఫ్రెంచ్ తులసి,వెటివర్,ధవన,టాగెటెస్, అన్నాటో,మెంత.
▪️గౌరవాలు
||పోలీస్ అధికారిగా ||
•1972లో ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నారు.
•1982లో రాష్ట్రపతి పోలీస్ మెడల్
అందుకున్నారు.
||ఆదర్శ రైతుగా ||
•ఔషధ సుగంధ మొక్కల సాగును ప్రోత్సహిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేయడంలో కృషి చేసినందుకు గానూ -
2001 లో భారత మాజీ ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు గారి చేతుల మీదుగా
"స్వామి రామానంద తీర్థ" అవార్డు అందుకున్నారు.
•వ్యవసాయ రంగంలో ఆయన కల్పించిన ఉపాధి అవకాశాలు, మార్కెట్ అనుసంధాన ప్రక్రియలో చేసిన కృషికి గానూ -
2001 లో అప్పటి కేంద్ర మంత్రి శ్రీ ప్రమోద్ మహాజన్ గారి చేతుల మీదుగా "ఉద్యోగశ్రీ అవార్డు" అవార్డు అందుకున్నారు.
•తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాల్లో రైతులు ప్రత్యామ్నాయ పంటల /ఔషధ మొక్కలు ద్వారా లాభాలు పొందేలా అవగాహన కల్పించినందుకు గానూ -
2001 లో యువ, విద్యావంతులైన రైతుల తరపున
"ఓషధి మిత్ర అవార్డు" అందుకున్నారు.
▪️ అనారోగ్యాన్ని జయిస్తూ...
కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆయన చూపిన ఉత్సాహం ఎందరికో స్ఫూర్తిదాయకం. 'జ్ఞానమే శక్తి' అని నమ్మి, 79 ఏళ్ల వయసులో, రెండు బైపాస్ సర్జరీలు, క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలతో పోరాడుతూ కూడా ఆయన విశ్రమించలేదు. దేశంలో ఎక్కడ సెమినార్లు జరిగినా హాజరవుతూ, ఆ జ్ఞానాన్ని గ్రామీణ నిరుద్యోగ యువతకు చేరవేశారు..
▪️మహాభినిష్క్రమణ
స్వాతంత్య్ర సమరయోధుడుగా దేశం కోసం పోరాడి,, ప్రాతస్మరణీయుడిగా దీన జనుల పక్షాన నిలబడి, ఐపీఎస్ అధికారిగా అంకితభావానికి కట్టుబడి, తన జీవిత కాలాన్ని సమాజంలోని రుగ్మతలను మార్చడానికి వెచ్చించిన సమతావాది గొంగిరెడ్డి రాఘవరెడ్డి ఏప్రిల్ 4 వ తేదీ, 2022 లో తన 94 ఏట హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాలం చేసారు.
______________________
ఆధారం :
•గొంగిరెడ్డి రాఘవరెడ్డి ఆత్మకథ - "As I Look Back" (ప్రతులు)
•వివిధ దినపత్రికల్లో వెలువడిన గొంగిరెడ్డి రాఘవరెడ్డి గారి పరిచయ వ్యాసాలు, ఇంటర్వ్యూలు.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Hyderabad